దేశవ్యాప్తంగా.. వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ పరీక్ష జులై 17న ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు ఈ సారి 95 శాతం మంది హాజరైనట్లు అంచనా. దేశవ్యాప్తంగా ఈఏడాది 18.72 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. రికార్డ్ స్థాయిలో 95 శాతం హాజరైనట్లు సమాచారం.
ఇక.. NEET 2022 Result ఆగస్టు ఫస్ట్ వీక్ లేదా ఆగస్టు 15 లోపు విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే అధికారిక ఆన్సర్కీ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://neet.nta.nic.in/ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక ప్రశ్నపత్రం విషయానికొస్తే.. గడచిన రెండేళ్లతో పోలిస్తే ఈసారి నీట్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా వచ్చినట్లు విద్యార్థులు, నిపుణులు చెబుతున్నారు. ప్రతీసారీ ఫిజిక్స్ కఠినంగా ఉంటే.. ఈ ఏడాది బయాలజీ, కెమిస్ట్రీలో టఫ్ క్వశ్చన్స్ వచ్చాయంటున్నారు. ఈసారి ఫిజిక్స్ ప్రశ్నలు సులభంగా ఉన్నాయంటున్నారు.
125-130 మధ్యలో కటాఫ్ మార్క్:
గత ఏడాది 480కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఈ ఏడాది 450పైగా మార్కులు సాధిస్తే సీటు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లలో పేపరు కొంచెం సులువుగా ఉండటం వల్ల మొత్తం 720 మార్కుల్లో.. 700 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు ఎక్కువమంది ఉన్నారు.
ఈసారి ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉండడంతో.. అన్ని మార్కులొచ్చేవారు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. గతేడాది (2021)లో కటాఫ్ మార్కు జనరల్లో 138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.