ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్లో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. విభజన చట్టానికి అనుగుణంగా 2019 జనవరిలో ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్ను కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు. 2020 ఫిబ్రవరిలో హైకోర్టును అమరావతి నుంచి.. కర్నూలుకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని గుర్తు చేశారు.
హైకోర్టు నిర్వహణ ఖర్చును భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. ఈ విషయంలో హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత హైకోర్టును కర్నూలుకు మార్చడంపై పూర్తి ప్రతిపాదన రావాల్సి ఉందన్నారు. దీనిపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం రెండూ తమ అభిప్రాయాలను కేంద్రానికి సమర్పించాలని గుర్తు చేశారు.
ఇటీవల లోక్సభలో కూడా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ ఇచ్చారు. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని సభలో తెలిపారు. రాష్ట్ర హైకోర్టు నిర్వహణ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని.. హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సి ఉంటుందని వివరించారు.