కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీ మంత్రి. కోనేరు రంగారావు, 1935, జూలై 26న కృష్ణాజిల్లా గూడవల్లి గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి తాతయ్య. గూడవల్లి గ్రామానికి పంచాయితీ సర్పంచిగా రాజకీయ జీవితము ప్రారంభించిన రంగారావు సర్పంచిగా 10 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తరువాత కంకిపాడు నియోజకవర్గము నుండి శాసనసభకు ఎన్నికై, సామాజికాభివృద్ధి శాఖా మంత్రి అయ్యాడు. ఈయన పురపాలక శాఖ, దేవాదాయ శాఖ, సామాజికాభివృద్ధి శాఖలలో మంత్రిగా పనిచేశాడు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాములో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. రంగారావు తిరువూరు నియోజకవర్గము నుండి కూడా శాసనసభకు రెండు పర్యాయములు ఎన్నికైనాడు. రంగారావు 2010 మార్చి 15 న మరణించాడు. ఆయన సతీమణి కోనేరు అలీసమ్మ. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.