జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ..

0
4

రామగుండం సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు.
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ‘ఉజ్వల భారత్‌- ఉజ్వల భవిష్యత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ వినియోగదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌ వేదికగా ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యుదీకరణ అనంతరం దేశ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై హిమచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, విశాఖపట్నం, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ వాసులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రామగుండం 100 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుతో పాటు కేరళలోని 92 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును జాతికి అంకింతం చేశారు. అదేవిధంగా రాజస్థాన్‌లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గుజరాత్‌లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఇవాళ చేసిన కార్యక్రమాలు రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేశాం. మనం ఇప్పుడే చూశాం.. విద్యుదీకరణ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. సోలార్‌ విద్యుత్‌తో పాటు హైడ్రోజన్‌ గ్యాస్‌ వల్ల కలిగే ప్రయోజనాలు దేశ ప్రజలకు చేరబోతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం దేశంలో విద్యుత్‌ పరిస్థితి ఎలా ఉండేదో.. కరెంట్‌ కోతలు, పంపిణీ ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో మనందరికీ తెలుసు. దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, వినియోగ స్థితిని మెరుగుపరచడానికి ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్‌ ప్రతి ఒక్కరికీ అందించే విధంగా ప్రణాళిక రూపొందించడమే కాకుండా సంస్కరణలో భాగంగా స్మార్ట్‌ మీటర్లు ప్రవేశ పెట్టాం’ అని తెలిపారు.’ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ ప్రాజెక్టులు మనం దేశంలో ఉన్నాయి. తెలంగాణ, కేరళలో జాతికి అంకితం చేసిన నీటిపై తేలియాడే సోలార్‌ ప్రాజెక్టులు దేశంలోనే పెద్దవి. ఈ ప్రాజెక్టులు సూర్యరశ్మి, విద్యుత్‌తో పాటు నీరు ఆవిరి కాకుండా సంరక్షిస్తాయి. కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా తన ఐదేళ్ల పాలన గడిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. చాలా రాష్ట్రాల్లో పాత విద్యుత్‌ లైన్ల ద్వారా సరఫరా చేయడం వల్ల నష్టాల బారిన పడుతున్నాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్నా.. ఇంకా సబ్సిడీలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి చర్యలు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయి. విద్యుత్‌ రంగాన్ని రాజకీయాలతో ముడిపెట్టకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. గత ఎనిమిదేళ్లలో సంస్కరణలు చేపట్టకపోతే దేశపరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రాజకీయాలకు అతీతంగా విద్యుత్ రంగాన్ని బలపరిచేందుకు కలిసి రావాలని అన్ని రాష్ట్రాలను విజ్ఞప్తి చేస్తున్నా’ అని మోదీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here