పింగళి వెంకయ్య గారి 146 వ జయంతి

0
24

పింగళి వెంకయ్య, (1876 ఆగష్టు 2 – 1963 జూలై 4), స్వాతంత్ర్య సమర యోధుడుభారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం” అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

బాల్యం, విద్యాభ్యాసం,

పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణంగా ఉండేవాడు. అతని తాత అడివి వెంకటాచలం చల్లపల్లి సంస్థానం ఠాణేదారు. అతనికి పెదకళ్ళేపల్లి బదిలీ కావటం వల్ల వెంకయ్య ప్రాథమిక విద్య అక్కడే పూర్తి అయింది. అతని చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చల్లపల్లి లోను, మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు. చొరవ, సాహసం మూర్తీభవించిన అతను బొంబాయి వెళ్ళి, 19వ యేట సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలోని రెండవ బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. స్వదేశం వస్తూ అరేబియా, ఆప్ఘనిస్థాన్ లు చూచి వచ్చాడు.

మద్రాసులో ఫ్లేగు ఇనస్పెక్టరు శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్లారిలో ప్లేగ్ ఇనస్పెక్టరుగా పనిచేసాడు. అతని జ్ఞాన దాహం అంతులేంది. శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనమిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేసాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఎ.వి. కాలేజీలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించాడు. అప్పటి నుండి “జపాన్ వెంకయ్య” అని పిలిచేవారు.

ఉద్యమాలలో పాత్ర:

19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న రెండవ బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది.

ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే అభిమాన విషయంగా పెట్టుకొని, దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించాడు.1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై, నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపాడు.1916లో “భారతదేశానికొక జాతీయ జెండా ” అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాసాడు.

త్రివర్ణ పతాక ఆవిష్కరణ:

1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు[2].

గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నాడు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.

1947జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.

జెండా వెంకయ్య:

ఒక జాతికీ, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికీ ఒక పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం వెంకయ్యకు 1906లోనే కలిగిందని అనవచ్చు. కారణం కలకత్తా కాంగ్రెస్‌ సభలు.1916 నుంచి 1921 వరకు ఎంతో పరిశోధన చేశారు. 30 దేశాల పతాకాలను అతను సేకరించాడు. 1918 సంవత్సరం మొదలు, 1921 వరకు జరిగిన కాంగ్రెస్‌ సమావేశాలలో వెంకయ్య జెండా ప్రస్తావన తీసుకువస్తూనే ఉన్నారు. ఆఖరికి కాకినాడ కాంగ్రెస్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు (1921 మార్చి 31) తొలిసారి అతని ఆశ నెరవేరింది. అంతకు ముందు కలకత్తా సమావేశాల సందర్భంగా ఒక పతాకం తయారయింది. దానిని ఆ నగరంలో బగాన్‌ పార్సీ పార్కు దగ్గర ఎగురవేశారు. అందుకే దానిని కలకత్తా జెండా అనేవారు. మేడమ్‌ బైకాజీ కామా, అనిబీసెంట్సిస్టర్‌ నివేదిత భారత దేశానికి ఒక పతాకాన్ని రూపొందించాలని తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆ అవకాశం వెంకయ్యకు లభించింది. 1921లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు వెంకయ్య కలుసుకున్నాడు.

జెండా గురించి ప్రస్తావన వచ్చింది. తన పరిశోధనను, ప్రచురణను వెంకయ్య గాంధీజీకి చూపించాడు. గాంధీజీ కూడా సంతోషించాడు. ఉద్యమానికి అవసరమైన పతాకం గురించి అతను వెంకయ్యకు సూచించాడు. స్థలకాలాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజితులను చేయగలిగిన జెండా కావాలని గాంధీ ఆకాంక్ష. మువ్వన్నెలలో గాంధీజీ తెల్లరంగును, వెంకయ్య కాషాయం ఆకుపచ్చ రంగులను సూచించారు. దీనికి ఆర్యసమాజ్‌ ఉద్యమకారుడు లాలా హన్స్‌రాజ్‌ ధర్మచక్రాన్ని సూచించాడు. ‘‘ఒక జాతికి పతాకం అవసరం. పతాకాన్ని రక్షించుకునే పోరాటంలో లక్షలాది మంది కన్నుమూస్తారు. జెండా విగ్రహారాధన వంటిదే అయినా, చెడును విధ్వంసం చేసే శక్తి ఉంది. బ్రిటిష్‌ వాళ్లు వారి జెండా యూనియన్‌ జాక్‌ను ఎగురవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు.’’ అన్నారు గాంధీజీ. ఆఖరికి ధర్మచక్రంతో కూడిన  త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. అందుకే అతను జెండా వెంకయ్య.

‘మన జాతీయ పతాకం’ పేరుతో యంగ్‌ ఇండియా పత్రికలో గాంధీజీ రాసిన మాటలు ప్రత్యేకమైనవి. ‘‘మన జాతీయ జెండా కోసం త్యాగం చేసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేస్తున్న (అప్పటికి పింగళి అక్కడ అధ్యాపకుడు) పింగళి వెంకయ్య ఒక పుస్తకం ప్రచురించారు. అందులో వివిధ దేశాల జెండాల నమూనాలు ఉన్నాయి. అలాగే మన జాతీయ పతాకం నమూనా ఎలా ఉండాలో కూడా ఆయన సూచించారు. జాతీయ పతాకాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్‌ సభలలో ఆయన పడిన శ్రమ, తపనలకు నేను అభినందిస్తున్నాను. నేను విజయవాడ వెళ్లినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు – ఆ రెండు రంగులతో పతాకాన్ని రూపొందించవలసిందని వెంకయ్యగారికి సూచించాను. పతాకం మధ్యలో ధర్మచక్రం ఉండాలని కూడా సూచించాను. తరువాత మూడు గంటలలోనే వెంకయ్యగారు పతాకం తెచ్చి ఇచ్చారు. తరువాత తెలుపు రంగు కూడా చేర్చాలని భావించాం. ఎందుకంటే ఆ రంగు మన సత్య సంధతకీ, అహింసకీ ప్రతీకగా ఉంటుంది.’’ అని గాంధీజీ తన పత్రికలో రాశారు.

ఆఖరి సంవత్సరాలు:

వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు అతనిని చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో అతను చిన్న గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. అతను ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, భారత పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్య పేరుని సూచించకపోవడం విచారకరం.తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు.

జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ‘ త్రివేణి ‘ సంపాదకులు భావరాజు నరసింహారావు పేర్కొన్నాడు. అంతిమదశలో విజయవాడలో కె.ఎల్.రావు, టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే 1963జూలై 4 న వెంకయ్య దివంగతుడయ్యాడు.

కన్నుమూసేముందు అతను చివరి కోరికను వెల్లడిస్తూ ” నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక ” అన్నాడు

జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. అతనిని ప్రజలు మరచిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై అతని కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి అతని దర్శన భాగ్యం ప్రజలకు లభింపజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here