కర్ణాటక స్పెషల్ వంటకం బిసిబెళ బాత్. దీన్ని చాలా మంది సాంబారన్నమే కదా అని తేలికగా తీసుకుంటారు కానీ, దీని రుచి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. దీనిలో పోషకాలు కూడా ఎక్కువ. ఇందులో వాడే కందిపప్పు, ఆనపకాయ, ములక్కాడలు, మిరియాలు, కొత్తిమీర… ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే. పిల్లల లంచ్ బాక్సుకు ఇది బెస్ట్ రెసిపీ. పెద్ద వాళ్లకు కూడా దీన్ని లంచ్ లో టేస్టీగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
వండిన అన్నం – రెండు కప్పులు
కంది పప్పు – ఒక కప్పు
శెనగపప్పు – రెండు స్పూనులు
ములక్కాడలు – అయిదు ముక్కలు
ఆనపకాయ ముక్కలు – చిన్నముక్కలు (అర కప్పు)
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు
మిరియాలు – నాలుగు
ఆవాలు – అరస్పూను
జీలకర్ర – అర స్పూను
ఎండు మిర్చి – రెండు
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – రెండు స్పూనులు
కొబ్బరి తురుము – ఒక స్పూను
ఇంగువ పొడి – చిటికెడు
బెల్లం – చిన్న ముక్క
నెయ్యి – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పచ్చిమిర్చి – రెండు
పసుపు – అర స్పూను
చింతపండు – చిన్న ఉండ
తయారీ ఇలా…
1. ముందుగానే అన్నం వండి పెట్టుకోవాలి.
2. కుక్కర్లో కందిపప్పు, క్యారెట్లు, ఆనపకాయలు, ములక్కాడలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా ఉడికించాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు వేసి వేయించాలి. వీటిన్నింటినీ మిక్సీలో వేసి, కొబ్బరి తురుము వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి.
4. చింతపండు నానబెట్టుకుని రసం తీయాలి.ఆ రసంలోనే మిక్సీలో చేసుకున్న పేస్టుని కలపాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో చింతపండు రసం, పేస్టు మిశ్రమాన్ని వేయాలి.
6. అవి వేగాక కుక్కర్లో ఉడికించిన మిశ్రమాన్ని వేసి కలపాలి.
7. అందులో ఉప్పు, బెల్లం కలిపి సాంబారులా ఉడికించాలి. కొత్తిమీర కూడా చల్లాలి.
8. ఆ సాంబారు చిక్కగా అయ్యాక బాగా ఉడికించిన అన్నాన్ని వేసి బాగా కలపాలి.
9. పైన ఒక స్పూను నెయ్యి వేయాలి.