3,38,792 మంది పేద అక్క చెల్లెమ్మలకు లబ్ధి
రూ.508.18 కోట్లు ఆర్థిక సాయం
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్
ఇప్పటి వరకు కాపునేస్తం కింద రూ.1,491.93 కోట్లు సాయం
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారి అభ్యున్నతికి బాటలు
అమరావతి: వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నారు.ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉంటే చాలు.. మంజూరు చేస్తున్నారు. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడము అని సీఎం వైఎస్ జగన్ ప్రతి సమావేశంలో చెబుతూ.. అదే ఆచరిస్తున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు.