రోజురోజుకూ పెరుగుతున్న కలెక్షన్లు.. యూఎస్లోనూ రికార్డుకు చేరువగా
సీతారాముల ప్రేమకథకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. హృద్యమైన ప్రేమకథను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్, మలయాళ వెర్షన్స్లోనూ సీతారామం సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అటు ఓవర్సీస్లోనూ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ ల సహజ నటన, డైరెక్టర్ హను రాఘవపూడి టేకింగ్ సీతారామం సినిమాకు మెయిన్ అస్సెట్గా నిలుస్తున్నాయని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కలెక్షన్ల విషయానికొస్తే.. మొదటి మూడు రోజుల్లోనే రూ.25 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఐదు రోజులు పూర్తయ్యే సరికి రూ.33 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే వన్ మిలియన్ డాలర్ క్లబ్బుకు చేరువలో ఉంది.
నేటి నుంచి గల్ఫ్ లోనూ..
ఇదిలా ఉంటే గురువారం (ఆగస్టు 11) నుంచి యూఏఈలోనూ సీతారామం సినిమాను ప్రదర్శించనున్నారు. అలాగే పలు దేశాల్లో షోలు పెంచుతున్నారు. దీంతో సీతారామం కలెక్షన్లు మరింత పుంజుకోవచ్చునని ట్రేడ్నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రిలీజ్ ప్రారంభంలో కేవలం ఏ సెంటర్స్ లోనే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు బీ, సీ సెంటర్లలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. రిపీటెడ్ అడియన్స్ కూడా భారీగా పెరుగుతున్నారు. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన కీలక పాత్రలో నటించగా, అక్కినేని సుమంత్ బ్రిగేడియర్ విష్ణు పాత్రలో మెప్పించాడు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, భూమికా చావ్లా, ప్రకాశ్ రాజ్ తదితరులు తమ నటనతో మెప్పించారు. ఇక ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక సినిమాల్లో భారీతనానికి పెద్ద పీట వేసే వైజయంతి మూవీస్ సీతారామంతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.