సోనూ సూద్ (జ. జులై 30, 1973) ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. సోనూ సూద్ పంజాబ్ లోని మోగా అనే అనే పట్టణంలో జన్మించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. భారతదేశంలో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్త నిర్బంధం కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని స్వంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించడం, అలాగే ఆక్సిజన్ కొరత ఉన్నచోట్ల సిలిండర్లు సమకూర్చడం, ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకు దెరువు చూపించడం లాంటి చర్యలతో వార్తల్లోకి ఎక్కాడు.
సోనూ సూద్ పంజాబ్ లోని మోగా అనే పట్టణంలో జన్మించాడు. తల్లిదండ్రులు శక్తి సాగర్ సూద్, సరోజ్ సూద్. సోను సూద్ నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1996 లో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు
కోవిడ్-19 సమయంలో చేసిన సహాయాలు
సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపించాడు.
- కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో సూద్ వేలాది మంది భారతీయ వలస కార్మికులకు బస్సులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాడు.
- కిర్గిజ్స్తాన్లో చిక్కుకున్న 1,500 మంది భారతీయ విద్యార్థుల స్వదేశానికి తీసుకు రావడానికి సోను సూద్ వాళ్ళకి విమానాలను ఏర్పాటు చేసాడు.
- ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాకు, మదనపల్లెలో ఒక రైతు తన పొలాన్ని దున్నడానికి ఎద్దులు లేక, కూలీలకు డబ్బులు ఇవ్వలేక చివరికి తన సొంత కూతుళ్లను కాడెద్దులుగా మార్చి పొలం దున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోని చూసినా సోనుసూద్ వెంటనే స్పందించి పొలం పనుల కోసం ట్రాక్టర్ ఇచ్చాడు.
- తనరోజు పుట్టిన రోజు సందర్భంగా మరో కీలక ప్రకటన చేశాడు. వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశాడు.
- భారతదేశవ్యాప్తంగా కరోనా బాధితులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు. ఆక్సిజన్ లేకపోవడం తో చాలా మంది ప్రాణాలు కోకోల్పోతున్నారు. ఆక్సిజన్ అవసరమైన వారి కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను రెడీ చేసినట్లు సోనూసూద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పంచుకుంటూ ‘ఆక్సిజన్ ఆన్ ది వే’ అంటూ పేర్కొన్నాడు.
- నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీ ఇచ్చాడు.
- కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్లైన్ క్లాస్లకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు లేక పాఠాలు వినలేక పోతున్నారని ఉత్తర ప్రదేశ్ లక్నోలో సమీప గ్రామాల్లోని పేద విద్యార్థినిలకు స్మార్ట్ ఫోన్లు అందజేశాడు. 40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థినులకు ఆయన మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు.


