పంద్రాగస్టు వేడుకలపై ఉగ్రవాదుల కన్ను..
75వ స్వాతంత్య్ర ఉత్సవాల వేళ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంద్రాగస్టు వేడుకల సమయంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వేదికగా చేసుకుని లష్కరే తొయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులు చేసేందుకు స్కెచ్ వేస్తున్న కేంద్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు అన్ని రాష్టాల పోలీసులకు హెచ్చరికలు పంపాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగరంలోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వీటితో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, ఇతర రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచారు. అన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీన నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో గతంలో జరిగిన ఉగ్రదాడులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి తప్పు జగరకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వర్గాల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈనెల 30 వరకు హై అలర్ట్ కొనసాగుతుందని అధికార వర్గాలు ప్రకటించాయి.