మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నికకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. ఎవరికి వారు తమకే టిక్కెట్ కావాలంటూ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు:
కాంగ్రెస్ మొదలైన టిక్కెట్ల లొల్లి: మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి రెడ్డి ఓ కార్యకర్త మధ్య సెల్ఫోన్ సంభాషణ సోషల్మీడియాలో వైరల్గా మారింది. మునుగోడు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తో లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఓ కార్యకర్త స్రవంతికి చెబుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. అయితే కృష్ణారెడ్డికి టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ లో వచ్చిన ఫలితాలే ఇక్కడా వస్తాయని స్రవంతి అన్నట్లుగా సంభాషణ సాగింది.

ఈ ఆడియో సోషల్మీడియాలో వైరల్గా మారడంతో పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆ ఆడియోలో తాను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తనపై కక్షతో కొందరు కావాలనే ఆ ఆడియో క్లిప్ను సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. చల్లమల్ల కృష్ణా రెడ్డి నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అని.. అతనికి టికెట్ ఇస్తే ఓట్లు పడవని మాత్రమే చెప్పినట్లు స్పష్టం చేశారు.